కేంద్రంపై సీజేపీ ఫైర్.. సెప్టెంబర్ 5న ఢిల్లీలో భారీ నిరసన
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదంటూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 5న ఢిల్లీలో భారీ శాంతియుత నిరసన చేపట్టనున్నట్లు ప్రకటించింది. నీట్ పరీక్షల నేపథ్యంలో మృతిచెందిన విద్యార్థుల కుటుంబాలు, పోలీసుల వేధింపులకు గురైన బాధితులతో కలిసి ఈ ఆందోళన నిర్వహించనున్నట్లు తెలిపింది.సెప్టెంబర్ 5న ఇండియా గేట్ నుంచి ఢిల్లీలోని నూతన పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు నిరసన ర్యాలీ కొనసాగుతుందని సీజేపీ వెల్లడించింది. జూలై 25న కేంద్రం ఇచ్చిన హామీలను నమ్మి దేశవ్యాప్తంగా చేపట్టిన నిరసనలను విరమించుకున్నామని, అయితే ఇప్పుడు ప్రభుత్వం మాట తప్పిందని ఆరోపించింది.కేంద్రం వైఖరి యువతను, బాధిత కుటుంబాలను మోసం చేయడమేనని సీజేపీ విమర్శించింది. తమ సహనాన్ని బలహీనతగా భావించవద్దని హెచ్చరించింది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతోనే మరోసారి రోడ్డెక్కాల్సి వస్తోందని స్పష్టం చేసింది.ఆగస్టు 18న సుప్రీంకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా కూడా కేంద్రం నుంచి స్పష్టమైన హామీ రాలేదని సీజేపీ పేర్కొంది. దేశవ్యాప్తంగా నమోదైన ఎఫ్ఐఆర్ల జాబితాను అందిస్తే వాటిని రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తామని కోర్టు పేర్కొన్నప్పటికీ, ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాలేదని తెలిపింది.ఇప్పటికీ తమకు కేంద్రం నుంచి ఎలాంటి లిఖితపూర్వక హామీ అందలేదని సీజేపీ వెల్లడించింది. సెప్టెంబర్ 5న జరిగే నిరసనలో విద్యార్థులు, యువత, బాధిత కుటుంబాలు, సామాన్య ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చింది. “ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి” అనేదే తమ ప్రధాన డిమాండ్ అని స్పష్టం చేసింది.